Saturday, October 2, 2010

మార్గదర్శి

అల్లూరి గౌరీ లక్ష్మి
ఆంధ్రభూమి, October 1st, 2010

కథల పోటీలో ‘నా తర్వాత’ అనే కధకుగాను ప్రఖ్యాత రచయిత సురేంద్రబాబుకి ప్రథమ బహుమతి వచ్చింది. ఫెళఫెళలాడుతున్న ప్రత్యేక సంచిక తెప్పించుకుని తన కథ చదువుదామని కూర్చున్నాడు సురేంద్రబాబు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
కథ:
అది ఆంకాలజిస్ట్ డాక్టర్ అమర్ రూము. అతను ఎదురుగా కూర్చున్న పేషెంట్ ఈశ్వర్రావు రిపోర్టు చూస్తున్నాడు. డాక్టరు ముఖ కవళికల్ని బట్టి ఏ ప్రమాదమూ ఉండేటట్లు లేదనిపించి ఊపిరిపీల్చుకున్నాడు ఈశ్వర్రావ్. డాక్టర్ తన పర్సనల్ కాల్ ఏదో మాట్లాడుకుంటున్నాడు. ‘పదేళ్ళనుండీ సిగరెట్లు కాలుస్తున్నానని టెస్ట్ చేయించుకోమని పట్టుబట్టింది నిర్మల. అనవసరపు ఖర్చు అనుకున్నాడు ఈశ్వర్రావ్. సెల్ మూసేసి ‘‘మీతో ఎవరూ రాలేదా?’’ అనడిగాడు డాక్టర్. ‘‘ఫర్వాలేదు చెప్పండి’’ నవ్వుతూ అన్నాడు ఈశ్వర్రావ్.
‘‘మీకు గొంతు కేన్సర్ సెకండ్ స్టేజ్‌లో ఉంది’’ పిడుగు పడ్డట్టు డాక్టర్ వైపు చూశాడు ఈశ్వర్రావ్.
‘‘మీరంతగా భయపడక్కర్లేదు. చక్కని మందులున్నాయి’’ అనునయంగా అన్నాడు డాక్టర్.
‘‘మ...మందులున్నాయా?’’ గొంతు పెగిలించుకుంటూ అన్నాడు ఈశ్వర్రావ్.
‘‘అవును. ఇంజెక్షన్స్, మెడిసిన్స్, కీమోథెరఫీ. వీటివల్ల ప్రమాదాన్ని చాలా దూరం జరపొచ్చు.’’
‘‘ఎన్నాళ్ళు?’’ వెర్రిగా అడిగాడు ఈశ్వర్.
‘‘కొన్ని సంవత్సరాలు’’ అన్నాడు డాక్టర్.
‘‘కేవలం కొన్ని సంవత్సరాలు’’ నిర్వేదంగా అన్నాడు ఈశ్వర్.
‘‘అలా అంటే మిగిలినవారందరికీ ఆయుష్షు ఎవరూ రాసివ్వలేదు కదా! ఎవరికైనా ఎప్పుడైనా చావు వేరే దారిలో రావొచ్చు’’.
‘‘ఓదారుస్తున్నారా?’’ నిట్టూరుస్తూ అన్నాడు ఈశ్వర్.
‘‘లేదు వివరిస్తున్నా’’ అంటూ ట్రీట్‌మెంట్ వివరాలన్నీ రాసి ఫైల్ చేతికిచ్చాడు డాక్టర్.
వడివడిగా ఇంటికొచ్చిన ఈశ్వర్ మెదడంతా మొద్దుబారినట్లుగా అనిపించింది. భోజనానికి కూర్చుంటే వాంతయింది. భార్య నిర్మల కంగారుపడుతూ పాలు తెచ్చింది. అవి తాగి పడుకున్నాడు వౌనంగా. తెల్లవార్లూ కంటిమీదికి కునుకు ఒక్క సెకను కూడా రాలేదు. తెల్లవారేటప్పటికి అతని ఆలోచనకి ఒకదారి దొరికి గొప్ప తెగింపు వచ్చింది.

మర్నాడు ఆదివారం భోజనాలయ్యాక నిర్మలనీ, కొడుకు రామూనూ, కూతురు రాధనూ పిల్చి నెమ్మదిగా తనకు కేన్సర్ సోకిన విషయం చెప్పాడు. నిర్మలకి దుఃఖంతో మాట రాలేదు. మ్రాన్పడిపోయింది. పిల్లలిద్దరూ తండ్రిని పట్టుకుని బావురుమన్నారు. ఆ రోజంతా ఇంట్లో ఏడుపు తప్ప మాటలు లేవు.

రెండు రోజులు ఈశ్వరే వంట చేసి వాళ్ళకి తినిపించాడు, బలవంతంగా. మూడో రోజు మామూలుగా ఆఫీసుకి బయలుదేరాడు. పిల్లలిద్దర్నీ కాలేజీకి వెళ్ళమన్నాడు. ఎవరికీ ఏమీ చెప్పొద్దని ముగ్గురిదగ్గరా మాట తీసుకున్నాడు.

మర్నాడు ఉదయం కాఫీలు తాగుతుండగా పిల్లలతో అన్నాడు ఈశ్వర్ ‘‘అమ్మకి ఉద్యోగం చెయ్యాలని కోరిక ఉండేదర్రా! అదిప్పుడు తీరుతుంది. మా ఆఫీసులో అమ్మకి ఉద్యోగం ఇస్తారు’’. వాళ్ళిద్దరూ బిక్కమొహాలు వేశారు. ‘‘నేను చెయ్యను!’’ గట్టిగా ఏడ్చింది నిర్మల. ఆమెను దగ్గరగా తీసుకొని ఓదార్చాడు ఈశ్వర్. పిల్లలిద్దరూ వాళ్ళిద్దరినీ చుట్టుకున్నారు.

ఆ రాత్రి భార్యను దగ్గరగా తీసుకుని ‘‘నిమీ! నేను అనుకోకుండా యాక్సిడెంట్‌కి గురయ్యాననుకో! ఒక్కసారి ఊహించు. దానికన్నా మన పరిస్థితి ఎంతో నయం. అన్నీ చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. నీకూ, పిల్లలకీ ఇబ్బంది కలక్కుండా నేను ఊరికి పది రోజులు వెళ్ళేటప్పుడు నీకు అన్నీ తెచ్చిచ్చి వెళ్ళేవాణ్ణి గుర్తులేదూ! ఇదీ అంతే’’ లాలనగా చెప్పాడు ఈశ్వర్.

‘‘మీరన్నీ పుస్తకాల్లో కొటేషన్లు చెబుతున్నారు. నా స్థానంలో మీరుండి చెప్పండి’’ దుఃఖంతో నిష్ఠూరంగా అంటూ అతన్ని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నిర్మల.

ఒక రోజు ‘‘రామూ! సిటీలో చూడదగ్గ ప్రదేశాలన్నీ లిస్టు చెయ్యరా! మీ అమ్మకిష్టమైన తిరుపతీ, షిరిడీ, యాదగిరిగుట్టతో సహా రాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలో కూడా’’ అంటూ కొడుకుతో అన్నీ రాయించాడు ఈశ్వర్.

‘‘అవి కాదు. ముందు ట్రీట్‌మెంట్’’ అంది బాధగా నిర్మల.

‘‘అదెలాగూ డాక్టర్ చెప్పినట్టే జరుగుతుంది. ఖాళీ దొరికినపుడు ఇవి’’ అన్నాడు ఈశ్వర్ కూతుర్ని పైకెత్తుతూ.

‘‘డాడీ! నీకు తగ్గిపోతుంది’’ అంది రాధ తండ్రి నుదుటిపై ముద్దుపెట్టుకుంటూ. ‘‘అవును డాడీ!’’ అన్నాడు కొడుకు ఆర్తిగా.

‘‘మీ మమీకి చెప్పండిరా! బిక్కమొహం వేసుకోవద్దనీ, నవ్వుతూ ఉండమనీ...’’ అన్నాడు ఈశ్వర్.

తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది నిర్మల. భర్త అంత త్వరగా పరిస్థితికి ఇమిడిపోవడం ఆమెకు మరింత బాధనే కలిగిస్తోంది.

డాక్టర్ ట్రీట్‌మెంట్ ప్రారంభించాడు. ఆ రోజు హాస్పిటల్‌కి నలుగురూ వెళ్లారు. మొదటి ఇంజెక్షన్ చేశారు. ఒక రోజంతా అక్కడే ఉండవలసి వచ్చింది. మర్నాడు ఇంటికి వచ్చేశారు. ఇంజెక్షన్ బాధనుంచి తేరుకోవడానికి ఈశ్వర్‌కి మరో రెండు రోజులు పట్టింది.

తర్వాతి రోజుకి నీరసం తగ్గడంతో ఆఫీసుకు వెళ్ళాడు ఈశ్వర్. పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్లారు. నిర్మలకి మరీ దుఃఖం కలిగింది.

ఆ ఆదివారం అంతా సంఘీనగర్‌కి వెళ్ళారు. దేవుళ్ళ దర్శనం చేసుకున్నాక పిల్లలిద్దరూ అటూ ఇటూ తిరుగుతున్నారు. నిర్మల, ఈశ్వర్ కార్పెట్ గడ్డిలో కూచున్నారు. భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుంది నిర్మల.

‘‘నిర్మలా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నాకైతే ఏ దిగులూ కలగడంలేదు. మరణం కోసం ఎదురుచూస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాను. అలా ఎదురుచూడడం ఒక మనోహరమైన అనుభవం అనిపిస్తోంది. అసలు నేను త్వరలో ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అనగానే నా మనసు ప్రశాంతంగా మారిపోయింది. జీవితమే అన్ని బాధలకీ, భయాలకీ మూలమేమో నిర్మలా!’’ ఆమె వైపు నవ్వుతూ చూస్తూ అన్నాడు ఈశ్వర్.

‘‘మీరు వేదాంతం చెప్పకండి’’ అంది నిర్మల బాధగా.

‘‘మీరు ముగ్గురూ నేను లేకపోయినా కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఎవరో ఇచ్చే ఆప్తస్పర్శకోసం అల్లల్లాడకూడదు. మరి సానుభూతికి ఆశపడకూడదు. నేనెప్పుడూ నీ తోడుగానే ఉంటాను నీ ఊపిరిలో ఊపిరిగా. నాతో చర్చించి నీకు తోచినట్టు చెయ్యి. పిల్లలకి మంచి ఉద్యోగాలొస్తాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. నీకు మనోధైర్యం కలగాలని భగవంతుణ్ణి కోరుకున్నాను’’ నిర్మలని లేవదీస్తూ అన్నాడు ఈశ్వర్.

‘‘నాన్నగారు తన కథ తనే చదువుకుంటున్నార్రోయ్!’’ అన్న రాణీ గొంతు విని కథ చదవడం ఆపాడు సురేంద్ర.

‘‘కంగ్రాట్స్ డాడ్!’’ పిల్లలిద్దరూ మంచి నీళ్ళు తాగుతూ కోరస్‌గా అరిచారు. ‘‘మమీ మా ఇద్దరికీ చదివి వినిపించేసింది మీ కథ’’.

రాణీ పక్కనే కూర్చుంటూ ‘‘సూపర్బ్. అంత మెచ్యూర్డ్‌గా ఎలా రాస్తారండీ బాబూ!’’ నిజంగా మరణాన్ని అలా సులువుగా స్వీకరించగలమా! దేహత్యాగానికి అలా సిద్ధపడగలమంటారా! కానీ అలా చేయడం బావుంది. ఎంత ఆదర్శంగా ఆలోచిస్తారో మీరు!’’ అంది భర్తవైపు ఆరాధనగా చూస్తూ.

***

రచయిత సురేంద్రబాబు ఒక నేషనలైజ్ బాంక్ నుంచి వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్నాడు, పూర్తి టైం రచయితగా మారాలని. గత రెండేళ్ళుగా మూడు పుస్తకాలు ఆవిష్కరించాడు. ఈ మధ్య మూడు నెలలుగా అతనికి నిరుత్సాహంగా ఉంటోంది. తరచుగా జ్వరం వస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుని ఆ తర్వాత మాస్టర్ చెకప్ చేయించుకున్నాడు. రిపోర్టులిస్తూ కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్లో ఒక డాక్టర్‌కి రిఫర్ చేశాడు. మర్నాడు రాణి వస్తున్నానంటున్నా వద్దని డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు సురేంద్ర. అతని రిపోర్టులన్నీ వివరంగా చూశాడా డాక్టర్. ఆయన కాన్సర్ స్పెషలిస్ట్.

‘‘సురేంద్రగారూ! ఒకరకంగా మీరు అదృష్టవంతులేననుకోండి. మీకు లింఫ్‌నాడ్యూల్స్‌కి చాలా తక్కువగా కేన్సర్ సోకింది. ఒక విధంగా ఫస్ట్ స్టేజ్‌లోనే ఉంది. ఈమధ్యే ఒక పేషెంట్ వైజాగ్ నుంచి వచ్చి వెళ్ళాడు. అతను గత ఏడెనిమిదేళ్లుగా మీలాంటి సమస్యతోనే వైద్యం చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ కేన్సర్ అన్ని కేన్సర్‌లలోకి అతి తక్కువ ప్రమాదకరమయింది. మీరు అధైర్యపడకండి. నన్ను నమ్మండి. మీకు నయమయిపోతుంది. రోజురోజుకీ ఇంకా మంచి మందులు వస్తున్నాయి. వీలైనంత త్వరగా వైద్యం ప్రారంభిద్దాం’’ అన్నాడు డాక్టర్ ఎంతో దయగా.

సురేంద్రకు మెదడు మొద్దుబారిపోయింది. అసలు తనెక్కడ ఉన్నాడో అన్న సంగతి కూడా తోచక టేబిల్ మీద తలవాల్చేశాడు. డాక్టర్ చాలాసేపు ఓదార్చిన తర్వాత సురేంద్ర ఇంటినంబర్ ఇచ్చాడు. పిచ్చిచూపులు చూస్తూ షాక్ తిన్నట్టుగా ఉండిపోయాడు. రాణీ వచ్చాక కొంచెం తేరుకున్నాడు. డాక్టర్ ఆమెకు అన్నీ వివరంగా చెప్పి ధైర్యం చెప్పాడు. ఆమె గుండె దిటవు చేసుకుని భర్తను ఇంటికి తీసుకుని వెళ్ళింది.

మంచంపై పడుకుంటూ అన్నాడు సురేంద్ర ‘‘నా కథలోని పాత్ర నన్ను శపించింది’’. రాణి గుండె చెరువైంది అతని మాటలకి. అతనె్నలా ఓదార్చాలో తోచలేదామెకి.

‘‘ఆ హాస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ చేయించుకోమనీ పది సంవత్సరాలు గారంటీ ఇస్తామనీ అన్నాడండీ డాక్టరు!’’ అంది రాణి ఉద్వేగంతో బాధని అణచుకుంటూ.

‘‘నా అవసరం నీకు పదేళ్ళేనా! ఆ తర్వాత అఖ్ఖర్లేదా?’’ భర్త సూటి ప్రశ్నకు ఆమె చిగురుటాకులా వణికిపోయింది.

‘‘కాదండీ! మనమింకా అదృష్టవంతులమని ఆయనన్నాడు. మిగిలిన కాన్సర్లయితే సంవత్సరం కంటే కష్టమనీ డాక్టరనడంతో నేనలా అనేశాను. క్షమించండి’’ అంది రాణి కన్నీరు తుడుచుకుంటూ.

సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళు బెదిరిపోకుండా డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే చెప్పింది వాళ్ళకి. చిన్నకొడుకు ‘‘అమ్మా! మనం తిరుపతి మెట్లెక్కి వెళదాం అమ్మా! నాన్నకి తగ్గిపోతుంది’’ అన్నాడు. ‘‘అవునమ్మా!’’ అన్నాడు పెద్దవాడు.

పిల్లలిద్దర్నీ దగ్గరికి తీసుకుని తల్లిదండ్రులకి ఫోన్ చేసింది రాణి. రెండు రోజులు ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది. పిల్లలు స్కూలుకి వెళ్ళలేదు. మూడోరోజుకల్లా రాణి తల్లీ, తండ్రీ వచ్చారు. వాళ్ళని చూడగానే సురేంద్రతో సహా నలుగురూ కన్నీరు మున్నీరయ్యారు. వాళ్ళు పిల్లల్ని స్కూలుకి పంపి, డాక్టర్‌ని కలిసి వచ్చారు. రెండు రోజులు అందరికీ ధైర్యం చెప్పారు. ట్రీట్‌మెంట్ దగ్గరుండి మొదలుపెట్టించారు. సురేంద్రకీ, రాణికి భయపడవద్దని చెప్పి వారం రోజుల్లో వస్తామని ఊరికి వెళ్ళారు.

మర్నాడు ఆరోగ్యంతో నవనవలాడుతూ దిగిన బావమరిదిని చూడగానే సురేంద్రలో ఈర్ష్య భగ్గుమంది. నాకే రావాలా ఈ రోగం! ప్రపంచంలో ఎంతమంది లేరూ? కసిగా అనుకున్నాడు. బావమరిదితో ముక్తసరిగా మాట్లాడాడు.

సురేంద్ర బాంకు ఫ్రెండ్స్ అంతా వచ్చారొక రోజు. ‘‘మీరంతా కనీసం పార్టీలు చేసుకునేటప్పుడైనా నన్ను గుర్తుచేసుకోండి’’ నిష్ఠూరంగా అన్నాడు వాళ్ళతో.

‘‘నీకేం కాదురా! వదిన గారంతా చెప్పారు. నీకు తగ్గిపోతుందిరా’’ అన్నాడు ఫణి ఆప్యాయంగా.

‘‘మీ అందరికీ ఆనందంగా ఉండి ఉంటుంది, ఆ కేన్సరేదో మనకి రాలేదు అని. అందుకే అంతా వచ్చారు...’’ అందరివైపూ ఉక్రోషంగా చూస్తూ అన్నాడు సురేంద్ర. వచ్చిన వాళ్ళంతా చటుక్కున లేచి నిలబడ్డారు.

‘‘ఆయన అప్‌సెట్ అయి ఉన్నారు. మీరేం అనుకోవద్దు’’ అందరివంకా దీనంగా చూస్తూ అంది రాణి. అంతా బయలుదేరారు వౌనంగా. ఫణి మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘మాకు నిజంగా బాధనిపించే మిత్రులుగా వచ్చాంరా! నమ్ము’’ అంటూ సురేంద్ర వీపు తట్టాడు.

వాళ్ళు వెళ్ళాక భర్తను ఏదో అనబోయి తనని కూడా అలా అనొచ్చు అన్న భావన కలిగి వంటింట్లోకి వెళ్లిపోయింది రాణి. మరో రెండు రోజులకి సురేంద్ర తల్లీ తండ్రి వచ్చారు. కొడుకు సంగతి విని విలవిల్లాడిపోయారు. వారిని ఓదార్చడం రాణీ, పిల్లల వంతయింది.

ముసలి తల్లిదండ్రుల్ని చూడగానే సురేంద్రకి చిరాకు కలిగింది. ‘‘వీళ్లైతే డెబ్భై ఏళ్ళు వచ్చినా బ్రతికేస్తూ ఉంటారు. నేను మాత్రం యాభై రాకుండానే పోవాలి’’ కచ్చగా అనుకున్నాడు. ఆపుకోలేక ఒక రోజు తల్లితో కోపంగా అనేశాడు కూడా ‘‘నువ్వసలు కొడుకు ఆయుష్షు కోసం ఒక్క పూజైనా చేశావా?’’ అని.

‘‘నేనేం చేతురా తండ్రీ! నేనెవరినీ ఏనాడూ బాధపెట్టలేదురా దైవసాక్షిగా’’ అంటూ ఆమె కన్నీరు మున్నీరయింది. రాణికి భర్త ప్రవర్తన చూస్తుంటే అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. పిల్లలు కూడా భయపడుతున్నారు.

రెండు నెలలు గడిచాయి. సురేంద్ర మందులు వేసుకుంటున్నాడు. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళుతున్నాడు. అతనితో వద్దన్నా రాణీ కూడా వెళుతోంది. ఇంకొంత కాలం అయ్యాక ఇంజెక్షన్స్ మొదలుపెడతామన్నాడు డాక్టర్.

సురేంద్ర ఎవరితోనూ మాట్లాడడంలేదు. టీవీ చూస్తూ కూర్చుంటున్నాడు. లేదంటే వెర్రిగా నిద్రపోతున్నాడు.

ఒక రోజు ధైర్యం చేసుకుని అంది రాణి ‘‘మీరిలా అధైర్యపడితే ఎలాగండీ! ఎంత ధైర్యం ఇచ్చే రచనలు చేసేవారు మీరు!’’ అని. సురేంద్ర వెంటనే లేచి రాక్‌లో ఉన్న తను రాసిన నవలలూ, కథా సంపుటాలూ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ తీసి విసిరికొట్టాడు. అవాక్కయింది రాణి. మాట్లాడకుండా ఆ పుస్తకాలన్నీ తీసి పిల్లల గదిలో దాచి వచ్చింది. సురేంద్ర కనీసం పిల్లలతో కూడా మాట్లాడకపోవడం అందరికీ బాధ కలిగిస్తోంది. రాణి నిత్యం గుడికి వెళ్ళి ఒక గంట పూజలు చేసి వస్తోంది.

ఒక రోజు సాయంత్రం మేడ మెట్లమీద కూర్చున్నాడు సురేంద్ర. అతని మనసంతా అల్లకల్లోలంగా, దిగులుగా, శూన్యంగా అనిపిస్తున్నది. హఠాత్తుగా అతని మనసులో నేనొకసారి గుడికి వెళితే! అన్న ఆలోచన కలిగింది. వెంటనే బయలుదేరాడు. కాళ్ళు కడుక్కుని క్యూలో నిలబడ్డాడు. అందరితోబాటు నిశ్శబ్దంగా భగవంతుణ్ణి ప్రార్థించాడు, చేతులు జోడించి. బంగారు పూతతో వెంకటేశ్వరుడు గుడిలో మెరిసిపోతున్నాడు. చిరునవ్వుతో అభయహస్తం చూపుతున్నాడు.

స్వామి విగ్రహాన్ని తదేకంగా చూడగానే సురేంద్ర దుఃఖం పొర్లుకుంటూ వచ్చింది. ఆయన తన వైపు చూసి ధైర్యాన్ని ప్రసారం చేసినట్టనిపించింది. ఏ కోరికా వెల్లడించకుండా వెనుదిరిగాడు. ఎవరో ఆపి చేతిలో ప్రసాదంగా పెట్టిన శనగల్ని నోట్లో వేసుకున్నాడు. పక్కనే ఉన్న మంటపం మెట్లెక్కి కూర్చున్నాడు. భక్తులందర్నీ చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. క్రమంగా అతని మనసులోంచి ఒక సంఘర్షణ తొలగిపోయింది. అతని దుఃఖం ఒక్కసారిగా జీర్ణమయినట్లనిపించింది. తన వ్యాధిని ఎదుర్కొనే ధైర్యం వచ్చినట్టనిపించింది.

లేచి చకచకా ఇంటికి వచ్చాడు. ‘‘రాణీ! నా బహుమతి కథ ఇస్తావా?’’ అడిగాడు సోఫాలో కూర్చుంటూ. రాణీ ఫోల్డర్‌లో దాచిపెట్టిన అతని కధ తెచ్చి ఇచ్చింది.

సురేంద్ర కథ తీసి చదవడం మొదలుపెట్టాడు. అతని కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. కథ చదవడం పూర్తిచేశాడు. ఎంత అద్భుతంగా రాశాను!

ఈ కథ నేనే రాశానా! మరణం కోసం ఎదురుచూడడం ఓ మనోహరమైన అనుభవం. ఎంత మంచి వాక్యం! నా కధ నాకే ఈ దుఃఖపు చీకటిలో కరదీపికలా ఉంది. అజ్ఞానాంధకారంలో జ్ఞానజ్యోతిలా ఉంది.

ఈ మాటల కూర్పు ఎవరో నాకోసమే కుదిర్చి నా చేత రాయించారు. ఈ కథ నాతోనే ఉండాలి నిరంతరం అనుకున్నాడు ఆర్తిగా ఫోల్డర్‌ని గుండెల కానించుకుంటూ. కొంతసేపయ్యాక తల్లిదండ్రుల్నీ, భార్యనీ, పిల్లల్నీ పిలిచి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అటూ, ఇటూ. అందరివైపూ చూశాడు.

‘‘నేను ఇన్నాళ్ళూ చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మీరంతా పెద్దమనసుతో నన్ను క్షమించి ఓదార్చారు’’ అన్నాడు బాధతో గొంతు బొంగురుపోగా.

అందరి మనస్సులూ కలుక్కుమన్నాయి. ఉద్వేగంతో మళ్లీ అన్నాడు ‘‘రాణీ! నేను రాసిన కథ, ఈ బహుమతి పొందిన కథ నాకు మార్గదర్శి అయ్యింది. సరస్వతీ మాత ఈ కథని నాకు ఔషధంలా తయారుచేసి ఉంచింది.’’

పది చేతులు అతన్ని ఆప్యాయంగా నిమిరాయి. సురేంద్ర చేతులు చాచి అందరినీ దగ్గరకు పొదువుకున్నాడు ఆప్యాయంగా.

Tuesday, February 9, 2010

మావిడాకులు

మావిడాకులు  అల్లూరి గౌరీలక్ష్మి - Sun, 7 Feb 2010, IST (ఆంధ్రప్రభ డైలీ)
జర్రున ముక్కుచీదింది భార్య 'తెలంగాణా'.
'ఏమయ్యింది' అనుమానంగా చూశాడు భర్త 'సీమాంధ్ర'.
భార్య: నీతోనే సంసారం జెయ్యలేను, నాకు విడారులియ్యి
భర్త: మళ్లీ మొదలెట్టావా? ఇప్పుడేం కష్టమొచ్చింది?
భార్య: అసలు నిన్ను కట్టుకున్న కాడి నుంచీ నాకన్నీ కష్టాలే!
భర్త: ఇప్పుడేమంటావ్‌!
భార్య: ఇంకేమంటాను! నన్నొదిలెయ్యి, సుకంగుంటాను.
భర్త: ఇద్దరం కలిసుంటేనే లోకంలో మంచి పేరుంటుందే!
భార్య: నిజం చెప్పు నన్నెందుకు వదలవు నువ్వు.
భర్త: ఎందుకేంటెహె! నీమీద ప్రేమ నాకు.
భార్య: ప్రేమకాదు, నన్ను దోచుకోవాలని.
భర్త: భార్యాభర్తల మధ్య దోపిడీ, పీడ ఉండవే. ఒకరికొకరు అణకువగా ఉండి అభివృద్ధి చెందుతాం.
భార్య: అసలు నువ్వు నన్ను ఎదగనిచ్చావా?
భర్త: పెళ్లినాటి నుండీ ఇప్పటికి చాలా ఎదిగావు.
భార్య: నన్నొదిలేస్తే నేనింకా ఎదిగేదాన్ని.
భర్త: ఏమో! ఈ మాత్రం కూడా ఉండేదానివి కాదేమో!
భార్య: తప్పకుండా ఉండేదాన్ని నీ పెత్తనం లేకపోతే.
భర్త: ఆలూమగలన్న తర్వాత ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకోకపోతే పక్కమతం వాళ్లు చేస్తారా!
భార్య: ఆ బూచుతా, ఈ బూచుతా చూపెట్టి మన పెళ్లి చేశారు పెద్దలు.
భర్త: అప్పటి అవసరాలు, భయాలూ మర్చిపోయావు. అన్నీ నేర్చుకున్నావు. మొగుడవసరం తీరిపోయింది నీకు.
భార్య: అవును. నువ్వునాకొద్దు. ఖుల్లంఖుల్ల చెబుతుంటె సమజ్‌గాదా నీకు!
భర్త: నేను కానిమాటేమన్నా అంటున్నానా! కలిసుందామంటున్నా! అది మంచిమాటే కదా! నేను పెద్ద మనసుతో అంటుంటే నీకు లోకువగా ఉంది. ఎవరైనా ప్రేమ ఉన్నప్పుడే కలిసుందామంటారు. నీకు నా మీద ప్రేమలేదు. అదీ సంగతి (నిష్టూరంగా)
భార్య: చూడయ్యా! నీ భాషనాకర్థం కాదు. నీ తెలివి మాటలు నాకు రావు. నా భాష ఏరు. నాకత ఏరు.
భర్త: యాభైమూడేళ్లకి గుర్తొచ్చిందానీకు మన భాషల్లో తేడా ఉందని.
భార్య: ఔ మల్ల! నన్నెపుడూ ఎక్కిరిస్తవు.
భర్త: నువ్వుమాత్రం ఆయ్‌! ఓయ్‌! అని ఎన్నిసార్లు వెక్కించలేదు? మర్చిపోయావు.
భార్య: అయన్నీ వదిలెయ్‌! నిన్నేమర్చిపోదామనుకుంటున్నా.
భర్త: నీ ఇష్టం వచ్చినప్పుడు పొమ్మంటే నేను నోరు మూసుకుని వెళ్లిపోవాలా!
భార్య: అవును ఎల్లిపోవలసిందే! ఈ ఇల్లునాది. నేనీడనే ఉంటా.
భర్త: మానాన్నిచ్చిన డబ్బులన్నీ తెచ్చి ఈ ఇంటి మీద పెట్టి పేద్ద మేడచేశాను. ఇది నీకిచ్చేసి నేను చిప్పపట్టుకొనిపొమ్మనడం బావుందా నీకు!
భార్య: ఎంతపెట్టావో చెప్పు లెక్కజేసిచ్చేస్తా!
భర్త: ఈ మేడ మనిద్దరిదీ అనుకొని నా సొమ్మంతా పెట్టాను. నువ్విలా అంటావని తెలిస్తే లెక్కరాసేవాడిని. నాకు నీలా విడిపోయే దురాలోచనే ఉంటే మా ఊర్లోనే మేడ కట్టుకునే వాడిని.
భార్య: ఇప్పుడు మాత్రమేమయిందిపోయి కట్టుకో మేడ.
భర్త: ఇప్పుడు నాకక్కడ ఏమీలేదు. అన్నీ అమ్మి తెచ్చి ఇక్కడే పెట్టాను. ఇప్పుడు అంతానాదే పొమ్మంటున్నావ్‌! ఇంతన్యాయమా!
భార్య: ఏమన్యాయమున్నది! ఏం లేదు! అరవైతొమ్మిదిలోనే విడాకులడిగన. ఇప్పిస్త, ఇప్పిస్త అని మా చెన్నమావయ్య ఆఖర్న కలిసిపోండని చెప్పికుర్సీలో కూసున్నడు.
భర్త: అంతిష్టంలేని దానివి డెభైమూడులో నాక్కోపమొచ్చి నిన్నొదిలిపోతానన్నప్పుడు ఊరుకున్నావెందుకు? అప్పుడే ఒప్పేసుకుంటే ఇప్పటికి ఇద్దరం హాయిగా ఉండేవాళ్లం.
భార్య: అప్పుడునేను చిన్న పిల్లని తెలివిలేనిదాన్ని పెద్దలంతా చెప్పబట్టే కాపురం చేస్కుందామనుకున్న. నీకు తెలివెక్కువ. నీతోనేను వాదులాడలేను. నన్నొలెయ్యి.
చిలికి చిలికి గాలివానయ్యింది. భార్య తిండితినడం మానేసింది. భర్త మౌనంగా, పౌరుషంగా ఊరుకున్నాడు. చిదంబరం అంకులొచ్చాడు. భార్య చెప్పిన కష్టాలన్నీ ఓపికగా విన్నాడు. భర్త తననెలా పీడించుకునితిని లాభపడ్డదీ. తనెలా నష్టపోయిందీ కళ్లకు కట్టినట్టు చెప్పింది భార్య.
''అమ్మాయ్‌! నువ్వింత బాధలుపడుతున్నట్టు నాకు తెలీదుసుమా! నీకు, నేను దగ్గరుండి విడాకులిప్పిస్తానమ్మా. నీకున్యాయం చేస్తాను. నన్ను నమ్ముతల్లీ!'' అన్నాడు చిదంబరం అంకుల్‌. భార్య కళ్లుతుడుచుకుంది.
ఇది విన్న భర్త అవాక్కయ్యాడు. ఊహించని దెబ్బకి కెవ్వుమన్నాడు. తన బంధు బలగాన్నేసుకుని చిదంబరం ఇంటికి పరిగెత్తాడు. ''మమ్మల్ని విడదీయడం బావుందా అంకుల్‌! మేం యాభైమూడేళ్లు కాపురం చేశాం. ఏవో గొడవలొస్తే మాత్రం విడాకులిప్పించేస్తారా! నా తప్పు చెబితే దిద్దుకుంటాను కదా! ''అనికళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ''మీ అబ్బాయైతే ఇలాగా చేస్తారా?'' అని నిష్టూరమాడాడు.
చిదంబరం అంకుల్‌ ఆలోచనలో పడ్డాడు. ''అబ్బాయన్నదీ నిజమే కదా'' అని తల గోక్కుని అన్ని ఊర్లకీ పెద్దమ్మ సోనియమ్మతో చర్చించాడు. ఆవిడంతావిని తలపంకించింది. ''చూద్దాం! కొన్ని రోజులు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా నిమ్మళంగా ఉండమను. అసలేంజరుగుతోందీ, అన్నీ ఆరాతీద్దాం. అప్పుడు విడాకులిప్పించే సంగతి మాట్లాడదాం'' అంది సోనియమ్మ.
ఈ సంగతి వచ్చి చిదంబరం అంకుల్‌ భార్యాభర్తలిద్దరికీ చెప్పాడు. భర్తకాస్త ఊరటచెందాడు. భార్యకి వళ్లు మండింది.
''నేనడుగుతున్నా! విడాకులు! ఇప్పించాలి! అంతే గానీ ఆయన్నీ, అందర్నీ అడుగుడేంది? నాకు తెల్వక అడుగుతున్నా! ఇదేంన్యాయం!'' కోపంగా అరిచింది భార్య అంకుల్‌ని.
''మీ ఇద్దర్నీ అడిగి, అన్నీ విన్నాక నిర్ణయిస్తారు కానీ, ఏకపక్షంగా ఎలా ఇప్పిస్తారమ్మా? విడాకులు! ఇలా అమాయకం మాటలు మాట్లాడతావ్‌! ఏమన్నా అంటే మామీద కోప్పడతావ్‌!'' అని సముదాయించి వెళ్లాడు చిదంబరం అంకుల్‌.
భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా మిగిలారు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరిమధ్యా యుద్ధం ఆగి, ఆగి సాగుతోంది. అటువాళ్లూ, ఇటువాళ్లూ పార్టీలుగా ఏర్పడి వార్తలు పుట్టిస్తున్నారు. పితూరీలు మోస్తున్నారు. అగ్నికి ఆజ్యాంపోస్తూ కొందరూ, చల్లారుస్తూ కొందరూ టైంపాస్‌ చేస్తున్నారు బంధువులు.
ఒక రోజు..
భార్య: మనపెళ్లయినప్పుడే మా నేరూతాతన్నాడు. మన పిల్ల అమాయకురాలు. ఆపిలగాడితో ఎట్లా ఏగుతాదోనని...అదే నిజమైంది.
భర్త: తాతలంతా ప్రేమకొద్దీ అలాఅంటార్లే! పెళ్లాం అమాయకురాలు కదా అని ఏ భర్తైనా భార్యను కొట్టిచంపేసుకుంటాడా?
భార్య: ఇప్పుడదేనువ్వుచేస్తుంది.
భర్త: ఇలా అభాండాలేస్తేనే నాకు కోపమొచ్చేది.
భార్య: ఆఖరిమాట చెప్పు. నేనంటే నీకు గౌరవం ఉందా, లేదా!
భర్త: ఉంది.
భార్య: అయితే విడిపోదాం పద!
భర్త: పెద్దోళ్లకిచెప్పినాం కదా! వాళ్లేది మంచిదంటే అదే చేద్దాం. వాళ్లు విడిపోమంటే విడిపోదాం.
భార్య: అదీ! ఆ మాటమీదుండు.
భర్త: ఉంటాను. నువ్వు కూడా పెద్దవాళ్ల మాటవిను.
భార్య: సరే! అట్లనేలే.
ఇద్దరూ వాదులాడుకుని, అలిసిపోయి నిద్రపోయారు. ఇద్దరికీ కలలో చిదంబరం అంకుల్‌ కనబడ్డాడు. ఇద్దరూ సంతోషపడ్డారు. ఏం చెబుతాడోనని.
భార్యకొచ్చిన కలలో చిదంబరం అంకుల్‌ ''మీ ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. మీరిద్దరూ ఆనందంగా విడిపొండి'' అని చెప్పాడు. భర్తకొచ్చిన కలలో చిదంబరం అంకుల్‌ ''మీ ఇద్దరి విబేధాలకీ కారణమైన సమస్యలన్నిటినీ పరిష్కరించి మీ కాపురం నిలబెడుతున్నాం. మీ ఇంట్లో శుభకార్యం జరుపుకోవడానికి మావిడాకులు కట్టుకోండి'' అని చెప్పాడు.
ఇద్దరూ ఆనందంగా కళ్లుతెరిచారు. ఒకరి కొకరు కనబడడంతో నోళ్లు తెరిచారు.

Saturday, January 30, 2010

పరిష్కారం


పరిష్కారం -అల్లూరి గౌరీలక్ష్మి, Andhra Bhoomi, January 30th,2010


‘‘ఏమయినా సరే! నేను మా ఊరెళ్ళిపోతాను’’ అంది బింకంగా మహాలక్ష్మి. ఓ గంట బ్రతిమాలాక లేచింది. ‘ఈ రాష్ట్ర విభజన కాదు కానీ మా దంపతుల విభజన జరిగేట్టుంది’ అనుకున్నాడు దేవేందర్ నిట్టూరుస్తూ. ఇలాంటివే చెదురుమదురు కోపతాపాలు నడుస్తుండగా మరో వారం గడిచింది. ఒక రోజు దేవేందర్ ఆఫీసునుంచి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.
ఉదయానే్న నిద్రలేచి మహాలక్ష్మి ముగ్గులు వేస్తోంది. పక్కనే ఖాళీ స్థలంలో స్పీకర్ మోగుతోంది. రాత్రికి రాత్రే షామియానా వేశారు. అటుగా పరుగుతీస్తున్న సాయినడిగింది ఏమిటి సంగతని.
‘‘మాకు కొత్త రాష్ట్రం వస్తందట. రాత్రి ఓమ్మినిష్టర్ చెప్పిండంట’’ అంటూ తుర్రుమన్నాడు. ముగ్గులేస్తూ మహాలక్ష్మి ఆలోచించింది. ఈ మధ్య గొడవలకి ముగింపొచ్చిందన్నమాట అనుకుంది. ఇంతలో పేపర్‌వాడు విసిరిన పేపర్ అటూ ఇటూ తప్పి హెడ్‌లైన్స్ చదివింది.
గబగబా గదిలోకి వెళ్ళి ముక్కు ఎగబీలుస్తూ పెట్టె సర్దుకోవడం మొదలుపెట్టింది. నిద్రపోతున్న దేవేందర్ లేచి ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమయింది! పెట్టె తీశావేం? మా అమ్మేమయినా అందా?’’ కంగారుగా అడిగాడు.
‘‘ఒకరనాలా? అంతా కలిసి ఆ చిదంబరం చేత చెప్పించారు కదా!’’ అంటూ మహాలక్ష్మి కళ్ళు తుడుచుకుంది.
‘‘చిదంబరమా! వాడెవడు?’’
‘‘పేపర్ చూడండి’’ అంది పేపర్ పడేస్తూ. రాత్రి చిదంబరం ప్రకటన దేవేందర్ వినే పడుకున్నాడు. అప్పటికి మహాలక్ష్మి నిద్రపోయింది.
‘‘ఓ అదా! నేను రాత్రే చూశానే్ల’’ అన్నాడు నవ్వేస్తూ.
‘‘అంటే ఇప్పుడు మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు కదా. ఇక నేనెందుకుండాలింక. మా ఊరు వెళ్ళిపోతాను’’ అంది కోపంగా.
‘‘్భలే ఉన్నావు. రెండు రాష్ట్రాలు వస్తే భార్యాభర్తలు విడిపోతారని ఎవరు చెప్పారు?’’ అన్నాడు మళ్ళీ నవ్వుతూ.
‘‘విడిపోనక్కరలేదని ఎవరు చెప్పారు?’’ పెట్టె మూస్తూ అంది.
‘‘అవసరం లేదే! నా మాట వినవే. ఈ సంగత్తెలిస్తే నా దోస్తులంతా నవ్వునవ్వి చస్తారు’’ అంటూ బ్రతిమాలాడు.
‘‘అందుకోసం నన్నుండమంటారా! అసలిలాంటి కుట్ర ఉన్నప్పుడు ననె్నందుకు పెళ్ళిచేసుకున్నారు?’’
‘‘ఇది కుట్ర కాదే! యాభయ్యారులో ఏం జరిగిందంటే’’ అంటూ అయిదు నిమిషాలు చాలా చాలా చెప్పాడు. ఏడో క్లాసుతో చదువాపేసిన మహాలక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. కానీ భర్త బిక్కమొహం చూసి పెట్టె మంచం కిందికి తోసింది.
రెండు రోజులు గడిచాయి. ఒక రోజు దేవేందర్ ఇంటికొచ్చేసరికి అతని గది తలుపులు బిగించి ఉన్నాయి. కొడుకుని చూస్తూనే తల్లి పరుగున వచ్చి చెవిలో చెప్పింది ‘‘నాన్నా, నేనూ టీవీ చూస్తుంటే పక్కనే కూర్చుని చూసింది. మొగమింత చేసుకుంది. సాయంకాలం కాంగానే తలుపేసుకుని సక్కగా పండుకుంది. లేపితే లేస్తలేదు. నేనేమనే్లదు’’.
అంతా విని ‘అబ్బ! ఈ టీవీ నా ప్రాణం తీస్తోంది’ అనుకున్నాడు.
‘‘పడుకున్నావేం లక్ష్మీ తలనొప్పా!’’ ప్రేమగా అడిగాడు భార్యని. మహాలక్ష్మి కిమ్మనలేదు. అడగ్గా అడగ్గా నోరు విప్పింది. ‘‘టీవీలో ఆ ప్రాంతం వాళ్ళంతా దొంగలు అని ఇంకా ఏదేదో అంటుంటే మీ నాన్న మీ అమ్మని పిలిచి చూపించి నవ్వుతున్నారు. మా నాన్న కట్నకానుకలు అన్నీ అనుకున్నట్టే ఇచ్చారు కదా! ఇంకా మావాళ్ళ మీద ఏడుపెందుకు? అసలు మీరు మీ ప్రాంతం వాళ్ళనే చేసుకుంటే పోయేదిగా’’ అంది కోపంగా.
‘‘నీకు తెలుసు కదా! మీ నాన్నగారి ఫ్రెండు మా నాన్నగారి ఫ్రెండు. ఆయన ఈ సంబంధం తెచ్చాడు. నువ్వేమో నాకు నచ్చావు. మరి తప్పలేదు’’ అన్నాడు సంజాయిషీగా.
‘‘ఏమయినా సరే! నేను మా ఊరెళ్ళిపోతాను’’ అంది బింకంగా మహాలక్ష్మి. ఓ గంట బ్రతిమాలాక లేచింది. ‘ఈ రాష్ట్ర విభజన కాదు కానీ మా దంపతుల విభజన జరిగేట్టుంది’ అనుకున్నాడు దేవేందర్ నిట్టూరుస్తూ.
ఇలాంటివే చెదురుమదురు కోపతాపాలు నడుస్తుండగా మరో వారం గడిచింది. ఒక రోజు దేవేందర్ ఆఫీసునుంచి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తల్లి ఆత్రంగా పరుగున కొడుకు దగ్గరికి వచ్చింది. ‘‘అమ్మాయి దోస్త్‌తానికి పోయింది. ఏం కష్టం వచ్చిందిరా నాయనా! ఇంట్లో ఏం మాట్లాడుకోకుండా అయింది. టీవీ పెట్టాలంటే బయమైంది. మీ నాయన కూడా అందరికీ చరిత్ర చెప్పుడు బంద్ చేసిండు. టీవీ పెట్టగానే మా ఇద్దరివంకా అనుమానంగా చూస్తది. ఆ పిల్లకి సముదాయించి చెప్పరాదురా! ఏదయితే అదయితది. ఈమెందుకుడుక్కుంటది నా కర్తమే కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. తండ్రి కూడా ‘అవున్రా బాబూ’ అన్నట్టు తలూపాడు.
‘‘సర్లే! ఆమెకు మనమంతా ఒక ప్రాంతం, ఆమెది మరో ప్రాంతం అనిపిస్తోంది ఈ టీవీ చూస్తుంటే. దోస్త్ దగ్గరికి పొయ్యింది కదా జర కూలయితదిలే’’ అన్నాడు దేవేందర్. కోడలు లేదు కదా అని తండ్రి టీవీ ఆనందంగా పెట్టి కూర్చున్నాడు. తల్లీ, కొడుకూ అటూ ఇటూ కూర్చున్నారు టీ తాగుతూ.
నవ్వుతూ వచ్చింది మహాలక్ష్మి. ఊపిరి పీల్చుకున్నాడు దేవేందర్. భార్య పక్కన చేరి ముచ్చట్లకు దిగాడు. అంతా కలిసి భోజనాలు చేశారు. ముద్దు ముచ్చట్లయ్యాక బాంబ్ పేల్చింది మహాలక్ష్మి. ‘‘ఇదిగో చెబుతున్నాను. మా ప్రాంతం వాళ్ళని మీ ముగ్గురిలో ఎవరయినా, ఏమయినా అన్నారంటే మీరు ముగ్గురూ నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కెళ్ళి కేసు పెట్టేస్తానంతే’’ అనేసి ముసుగు బిగించింది. ‘ఇదా, ఆ మిత్రాణి ఇచ్చిన సలహా!’ అనుకుంటూ తలపట్టుకున్నాడు. ఆమె నిద్రపోయింది. అతనికి నిద్ర రాలేదు.
ఇలా దినదినగండంగా దేవేందర్‌కి మరో పది రోజులు గడిచాయి. రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయి తప్ప మెరుగుపడట్లేదనిపించిందతనికి.
టీవీ పెట్టగానే మహాలక్ష్మి వచ్చి కూచుంటోంది. వార్తా ఛానళ్ళు, చర్చలు చూసే మావగారు గతుక్కుమంటున్నారు. అత్తగారు సీరియల్ ఛానెల్‌కి మారుస్తోంది. మహాలక్ష్మి మొహం తేటపడుతోంది. అత్తాకోడలూ కలిసి వరసపెట్టి సీరియల్స్ చూసుకుంటున్నారు చర్చించుకుంటూ. దేవేందర్ తండ్రికి పిచ్చెక్కుతోంది వార్తలు చూడక. మిత్రుడింటికి పోయి తనివిరా మాట్లాడి టీవీ చూసి వస్తున్నాడు.
ప్రతిరోజూ సాయంత్రం ఇంటికొచ్చేసరికి ముగ్గురినుంచీ రిపోర్టులు దేవేందర్‌కి అందుతున్నాయి. తండ్రేమో వార్తల సంగతి, అమ్మేమో మావా కోడళ్ళమధ్య నలుగుతున్న సంగతి, భార్యేమో అందరినీ అనుమానంగా చూస్తూ ఇచ్చే దమ్‌కీల సంగతి అన్నీ కలగలిసి అతనికి అత్యవసర నిర్ణయం తీసుకోవలసిన అవసరం పెంచాయి. చివరికి దేవేందర్ ఇద్దరు స్నేహితుల సలహాపై, టీమ్ లీడర్‌ని సహాయం అడిగి అనుకున్నది సాధించాడు. ‘అమ్మయ్య! ఇక సముద్రపుటొడ్డున సేదదీరాలి’ అనుకున్నాడు. ఇంటికొచ్చి తన నిర్ణయం చెప్పాడు. ముగ్గురూ అవాక్కయ్యారు.
దేవేందర్ తను పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఉన్న చెన్నై బ్రాంచ్‌కి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. మరో కొత్త ప్రాజెక్టు కోసం అతనక్కడ పనిచెయ్యాలి. ఈ సంగతి ముగ్గురికీ ఆనందంగా వివరించి చెప్పాడు.
‘‘ఇప్పుడెందుకురా! రాష్ట్రం సంగతి తేలాక వెళ్లు’’ అనునయించబోయాడు తండ్రి.
‘‘అది తేలేటప్పటికి నా కాపురం రెండు ముక్కలవుతుంది. అప్పుడు మీరో ముక్కలో మేమో ముక్కలో ఉండవలసి వస్తుంది’’ అన్నాడు విసుగ్గా, కోపంగా.
‘‘సర్లే నాయనా! నీవెట్లంటె అట్లా!’’ అని తన మద్దతు ప్రకటించింది తల్లి.
తన సమస్యకి ఇదెలా పరిష్కారమో మహాలక్ష్మికి అర్థం కాలేదు. అయినా వౌనం వహించింది భర్తపై నమ్మకంతో.
టీవీ ప్యాక్ చేసి పంపుతుంటే ‘‘ముందే చెన్నైకి పంపుతున్నావా?’’ అనడిగాడు తండ్రి. ‘‘కాదు. నా ఫ్రెండ్ ఇంట్లో పెట్టి మళ్ళీ నేనొచ్చినప్పుడు అవసరం అనిపిస్తే తెస్తా!’’ అన్నాడు దేవేందర్. తండ్రి గిలగిల్లాడాడు టీవీ వెళుతుంటే.
‘‘మరి నాకు అక్కడ కాలక్షేపం?’’ కినుకగా అన్నాడు కొడుకుతో.
‘‘మీకు బోర్ కొట్టకుండా మీ ముగ్గురికీ మంచి పుస్తకం కొన్నాను. ముగ్గురూ కలిసి చదువుకోవచ్చు’’.
‘‘ముగ్గురికీ ఒక పుస్తకమా!’’ అంది ఆశ్చర్యంగా మహాలక్ష్మి.
‘‘అవును’’ అంటూ కవర్‌లోంచి తీశాడు దేవేందర్. అది ‘ముప్ఫై రోజుల్లో తమిళ భాష’ పుస్తకం.