Tuesday, February 3, 2015

కొత్త చూపు

A new book titled కొత్త చూపు which is a compilation of some of the stories written by                         A. Gouri Lakshmi is released.



జీవితం తునకలు తునకలుగా తెసుకుని ఆ మానవ వైరుధ్యాలను, వ్యక్తిత్వాల అల్పత్వాలు, ఔన్నత్యపు శిఖరాగ్రాలూ, సమస్త జీవన విస్తారాలను మనముందు౦చి తనదైన తీరులో రచయిత్రి కొత్త కోణం ఆవిష్కరిస్తున్న కధలు ఈ కొత్త చూపులో కనిపిస్తాయి. సమస్యలకు తొలి మూలం అయిన మానవ నైజాన్ని ఇది౦తేలే అన్నంత సులువుగా ఆవిష్కరించి తనదైన అభిప్రాయం పాత్రల పట్ల సానుభూతికో సమ భావనకో చూపిన గల్పికలు. జీవితంలో ఉన్నట్టే ఎన్నో పాత్రలు ఆపాత్రాల మధ్య అనుసంధానం ఏ పాత్ర ఏ పాత్రకు బొమ్మో బొరుసో చదివిఆకళి౦పు చేసుకునే విషయం పాఠకుల మేధకే వదిలారు , చదివి ఆలోచించవలసిన కధలు.

కొత్త చూపు
రచన: అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి
వెల: రూ 120
ప్రతులకు నవోదయ బుక్ హవుస్
కాచిగుడా క్రాస్ రోడ్స్
హైదరాబాద్ -27

జీవనది

Published in ఆంధ్రభూమి - 28/12/2014


  • కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
    ............................................................... 
    న్యూయార్కు నుండి స్వదేశానికి బయలుదేరిన ప్రసాద్‌కి ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. కారణం ఈసారి అతని ఇండియా ప్రోగ్రాంలో తన సొంతూరు పెదపుల్లేరు కూడా ఉంది. అతని భార్య అక్కడే అమెరికాలో ఎమ్మెస్ చదువుతోంది. ఆమెకి వీలులేక తనొక్కడే రావడం, ఒకరోజు టైం దొరకడంతో పదేళ్లనుంచి చెయ్యలేని తనకిష్టమైన పనిని తప్పక చేయాలని నిర్ణయించుకున్నాడు. అది తను పుట్టిన, తాత ముత్తాతల ఊరికి వెళ్లడం. ప్రసాద్ టెన్త్ పూర్తి కాగానే అతని తండ్రి తనకున్న పొలం కొంత అమ్మి, మిగిలిన పొలం కౌలుకిచ్చి మిత్రులతో కలిసి హైదరాబాద్ వచ్చి బిల్డర్స్ బృందంతో కలిసి అపార్టుమెంట్లు కట్టే బిజినెస్ ప్రారంభించాడు.
    కొడుకును సిటీలో చదివించాలన్న కోరికతోనే అసలు హైదరాబాద్ వచ్చాడు. బిజినెస్ బాగానే కలిసొచ్చింది. కొడుకు ప్రసాద్‌ను బిటెక్ చదివించి అమెరికా పంపించాడు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసాడు. ఈ పదేళ్లలో ప్రసాద్ ఒక్కసారే స్వగ్రామం వెళ్లాడు. ఎప్పుడూ చదువులు, కోచింగ్‌లతో బిజీగా ఉండిపోయాడు.
    ప్రసాద్‌కి వూరిమీదా, బంధువుల మీదా మమకారం ఎక్కువ. వైజాగ్‌లో ఉండే తన ఊరివాడు, స్నేహితుడు సునీల్ ద్వారా ఎప్పటికప్పుడు సొంతూరి సమాచారం అంతా ఫోన్‌లు, మెయిల్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. వాళ్లంతా అతని ఊహల్లో నిత్యం మెదులుతునే ఉంటారు. అందుకే బంధువులందర్నీ ఈసారి కలవాలనీ, వారి ప్రేమను పంచుకోవాలని ఆశపడుతున్నాడు.
    ప్రసాద్‌కు ఇద్దరు పెదనాన్నలు ఒక చిన్నాన్న ఉన్నారు. పెద పెదనాన్న చాలా దర్జాగా రాజులా బతకాలనుకునే రకం. తాగుడు, పేకాట, కోడి పందాలు ఇలా సకల కళాప్రవీణుడు. అతని కొడుకులిద్దరు ఏవో డిప్లొమాలు చదువుకుని ఒరిస్సాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న ఆస్తంతా హరించుకుపోగా మిగిలిన కొద్దిపాటి కొబ్బరి తోటలో చిన్న పాక వేసుకుని ఉంటున్నాడు. ప్రసాద్‌కి పెద్దనాన్నని తలచుకుంటే కళ్ల నీళ్లు తిరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులవల్ల అంత పెద్దింట్లో ఉన్నాయన పాకలో వుండడం, ఎంత బాధ కలిగిస్తుందో కదా అనుకుంటూ ఉంటాడు.
    ప్రసాద్ చిన్న పెద్దనాన్నకి పిల్లల్లేరు. పరమ చాదస్తుడు. ప్రకృతి వైద్యం అనీ, ఆయుర్వేదమనీ, ఏవో మూలికలు తెచ్చి ప రిశోధన చేస్తూ ఉంటాడు. మహా కోపదారి. వాళ్లింట్లో పిల్లలంతా చేరి అల్లరి చేసేది ఆయన లేనప్పుడే. వస్తున్నాడని తెలియగానే అంతా పరుగే పరుగు. దొరికితే దెబ్బలే మరి. ఆయన భార్య చాలా మంచిది. ఆమెను ఆయన బాగా వేపుకు తినేవాడు. పచ్చి కూరలు, ఆకులు ఏవేవో తింటూ ఆవిడనూ అవే తినమనేవాడు. ఆమెను ఎక్కడికీ పంపేవాడు కాదు. పిచ్చి కోపం ఎక్కువై అప్పుడప్పుడు కొట్టేవాడు కూడా. ఆవిడ ఈయనతో వేగివేగి చివరికి ఓపికి తగ్గిపోయి విసుగెత్తి రెండేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుంది.
    ఆ సంగతి తెలిసిన దగ్గరనుంచి పాపం పెదనాన్న ఎంత కుంగిపోయాడో కదా పెద్దమ్మ చేసిన పనికి అనుకుంటూ ఒకసారి వెళ్లి ఆయన్ని ఓదార్చాలి అని నిర్ణయించుకున్నాడు ప్రసాద్. ఇక ప్రసాద్ చిన్నాన్న ఎప్పుడో చనిపోయాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. వాళ్లు కొంతకాలం భీమవరంలో మకాం పెట్టి బోలెడు ఫీజులు కట్టి చదవబోయి తిరిగి వచ్చేసారు. కొడుకులిద్దరు చదవమని భీష్మించడంతో చిన్నాన్న భార్య కొడుకులతో తిరిగి వచ్చేసింది. ఆమెకెప్పుడూ ప్రసాద్‌లా తన పిల్లలు చదువుకోవాలని ఆశ ఉండేది.
    తమ్ముళ్లిద్దరు వ్యవసాయం చేస్తున్నారట. ఏమన్నా మిగులుతున్నదో లేదో? వారికి సలహా ఇచ్చి ఏదన్నా చిన్న బిజినెస్ కూడా చేసుకోమని సలహా చెప్పాలి. వీలైతే కొంత ఆర్థిక సహాయం కూడా చేయాలి అనుకున్నాడు ప్రసాద్.
    హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి ఇంటికి వచ్చేసరికి తల్లీ తండ్రీ ఎదురు చూస్తున్నారు. ప్రసాద్ తల్లి కొడుకు ఒళ్లంతా నిమిరి కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘సర్లే సర్లే పని చూడు’ అన్నాడు తండ్రి. కొడుకుతో కలిసి వారు కూడా టిఫిన్, కాఫీలు చేసారు. ‘ఇంకా ఏంట్రా!’ అంటూ తన వెనకే తిరుగుతున్న తండ్రితో ‘నాన్నా! మనూరికి వెళదామా?’ అన్నాడు ప్రసాద్.
    ‘‘నాకు పనుందిలేరా! అయినా ఉన్న ఒక్కరోజు ఇక్కడ ఉండకుండా అక్కడికి ఎందుకురా? పెళ్లా ఏమన్నానా? అని విసుక్కున్నాడాయన.
    ‘‘వచ్చినప్పుడల్లా అంటున్నాడు. పోనీ ఒకసారి చూసిరానివ్వండి. ఎల్లుండి పొద్దున్నకల్లా వచ్చేస్తాడు’’ అంది తల్లి.
    ‘‘వచ్చి ఆ రాత్రికే వెళ్లిపోవడం!’’ అన్నాడు తండ్రి అసంతృప్తిగా
    ‘‘ఏదో ఆఫీసు పని వుండి వచ్చాను నాన్నా ఇప్పుడు. లేకపోతే వచ్చేవాడ్నే కాదు. పెద్దమ్మ పోయింది కదా! చిన్న పెదనాన్నని పలకరిస్తాను. ఇంకా పెద్ద పెదనాన్న, పిన్నీ పిల్లలూ..’’
    ‘‘సరే మరి నీ ఇష్టం! నేను బైటికి వెడతాను’! అన్నాడు తండ్రి. ఆయన వెళ్లాక తను కూడా స్నానం చేసి ఆఫీసు పనిమీద బైటికి వెళ్లిపోయాడు ప్రసాద్. సాయంత్రం వచ్చి భోజనం చేసి రాత్రి తొమ్మిదికి భీమవరం బస్ ఎక్కాడు.
    బస్సులో కూర్చోగానే అతన్ని చిన్ననాటి మధుర జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. నిద్ర పడుతూ అంతలోనే మెలకువ వస్తూ రాత్రి గడిచింది. తెల తెలవారబోతోంది. టైం అయిదైంది. చల్లని గాలి మొహానికి మృదువుగా తగులుతోంది. ఎంతైనా మన దేశపు గాలిలో మన ఊపిరుంటుందేమో! అందుకే ఇంత హాయి అనుకున్నాడు. ఆకివీడు దాటగానే జాగ్రత్తగా చూసుకుని డ్రైవర్‌కి చెప్పి ‘ఉండి’ రైల్వే ట్రాక్ దగ్గర బస్సు దిగాడు ప్రసాద్.
    అక్కడినుండి పెదపుల్లేరు వంతెన దగ్గరికి నడిచి అక్కడున్న పెద్ద ఆటో ఎక్కి ఊర్లో దిగాడు. స్నేహితుడు సునీల్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ప్రసాద్‌ని చూసి వాళ్లెంతో సంతోషించారు.
    ‘‘మావాడు కూడా వస్తే బాగుండేది నాన్నా’’ అంది సునీల్ తల్లి.
    ‘‘నేను అనుకోకుండా వచ్చానండి. వాడికి సెలవు దొరకదు అన్నాడండి’’ చెప్పాడు. కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాక స్నానం చేసి ఆమె పెట్టిన టిఫిన్ తిని, ఊర్లోకి వెళ్లి మా వాళ్లని చూసి వస్తానండి అన్నాడు.
    ‘‘అలాగే బాబు’’ అంది సునీల్ తల్లి.
    ప్రసాద్ తిన్నగా భార్య పోయిన చిన్న పెదనాన్న ఇంటికి వెళ్లాడు. ఇల్లంతా సున్నం పోయి పెచ్చులూడిపోయి దుమ్ము పట్టి వుంది. ఇల్లాలు లేని ఇల్లని చూడగానే తెలుస్తోంది. లోపలికి వెళ్లేసరికి మంచంపై కూర్చుని ఏదోరాసుకుంటున్నాడాయన.
    ‘‘పెదనాన్నా!’’ అన్న పిలుపు విని తలెత్తి ‘ఓరి నువ్వంట్రా! ఎంత మారిపోయావురా! దొరబాబులా ఉన్నావు!’’ అన్నాడు ఆనందంగా.
    ‘‘మిమ్మల్నందర్నీ చూడాలని వచ్చాను పెదనాన్నా!’’ అంటూ మంచంపై అతని పక్కనే కూర్చున్నాడు ప్రసాద్.
    ‘‘పెళ్లయింది, అమెరికాలో ఉద్యోగం నీకేంట్రా?’’ అన్నాడాయన ప్రేమగా ప్రసాద్ భుజం చుట్టూ చెయ్యి వేసి
    ‘‘పెద్దమ్మ గురిచి తెలిసింది.చాలా బాధపడ్డాను పెదనాన్నా! ఎలా ఉన్నావు నువ్వు?’’ అన్నాడు ప్రసాద్.
    ‘‘ఏదో ఇలా నడిపిస్తున్నా. తప్పదు కదా ఆయుర్ధాయం ఉంది మరి’’ అన్నాడాయన నిర్లిప్తంగా
    కొంతసేపు ఇద్దరు వౌనంగా ఉండిపోయారు.
    ‘‘పెద్దమ్మ అంత పని చేసిందంటే ఎంత బాధపడిందో? కోపం తగ్గించుకోమని అందరూ చెప్పినా వినేవాడివి కాదు. ఇప్పుడు చూడు ఈ వయసులో నువ్వే వండుకోవాల్సి వస్తోంది.’’ అన్నాడు ప్రసాద్ బాధపడుతు.
    ‘‘నేను కోపం తగ్గించుకోవడం ఏమిట్రా? నీ తలకాయ్! అది నా సహజ లక్షణం. ఒరేయ్!మొగుడో దెబ్బ వేస్తే ఏమవుతుందిరా? అది కారణం కాదురా! దాని ఆయుష్షు తీరిపోయింది.. ఈ వంకన వెళ్లిపోయింది అంతే! నాకొకటే బాధ. ఏమింటంటే ఆత్మహత్య మహా పాతకంరా! ఘోర నరకంలో పడి ఉంటుంది. సందేహం లేదు. దానికి మళ్లీ జన్మ తప్పదు’’ అన్నాడు భార్య మరణాన్ని విశే్లషిస్తూ.
    పెద తండ్రి ఆత్మస్థైర్యానికి విస్తుపోయాడు ప్రసాద్. ఆ తర్వాత ఆయన బోలెడు లోకాభిరామాయణం కులాసాగా మాట్లాడాడు. రాజకీయాలు కూడా.
    మాటల మధ్యలో ప్రసాద్ ‘‘పెద్ద పెదనాన్న ఎక్కడున్నాడు?’’ అడిగాడు. ‘‘మన పొలంలోనేరా బాబూ! వాడి రాత అలా రాసుంది. ఎవడి కర్మకెవడు కర్తా? అన్నగారి స్థితికి బాధపడుతూ అన్నాడాయన. ఓ గంట తర్వాత ‘వస్తా మరి, ఆరోగ్యం జాగ్రత్త!’ అంటూ లేచాడు ప్రసాద్.
    ‘‘జాగ్రత్త! బాగా ఉద్యోగం చేసుకుని పైకిరా!’’ అని దీవించాడాయన.
    అక్కడినుండి బయలుదేరి పెద్ద పెదనాన్నకోసం ఊరి బైట వున్న పొలం వెళ్లాడు.
    స్వచ్ఛమైన గాలి రివ్వున వీస్తూ నిశ్శబ్దంగా ఉందక్కడ. మనసుకి ఎంతో ఆహ్లాదంగా, ఉల్లాసంగా తోచింది ప్రసాద్‌కి. పెదనాన్న పొలం చివర నివాస యోగ్యంగా కట్టినట్టు ఒక పాక ఉంది. దాని ముందు చక్కగా ముగ్గేసి ఉంది. చుట్టు దడి కట్టి ఉంది. చిన్న గేటు వుందక్కడ.
    దగ్గరికి వెళ్లి ‘‘పెద్దనాన్నా! అని పిలిచాడు. ఆ పిలుపు విని తడిక గేటు లోంచి బైటికి వచ్చి ‘‘ఏమే! ఎవరొచ్చారో చూడు!’’ అన్నాడాయన సంబరంగా. దగ్గరగా వచ్చి ప్రసాద్‌ని కౌగలించుకున్నాడు. ఆయన దగ్గరనుండి గుప్పున వాసనొచ్చింది ఎప్పట్లానే. మందు సిగరెట్ కలిసిన వాసన.
    ‘‘రారా!’’ అంటూ లోపలికి చెయ్యిపట్టుకుని తీసుకునివెళ్లాడు. ప్రసాద్ పెద తల్లి పొయ్యి దగ్గరనుంచి లేచి వచ్చింది. ‘‘అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మీ ఆవిడా?’’ అంటూ అడిగింది గ్లాస్ కడిగి కుండలోంచి మంచి నీళ్లు తెస్తూ.
    ఆమె మొహంలో అదే పెద్ద బొట్టు, మెడలో నల్ల పూసలూ, చేతికి మట్టి గాజులు. వనవాసం చేస్తున్న మహారాణిలా ఉందావిడ. పెదనాన్న అంత పెద్ద ఆజానుబాహుడు మడత మంచంపై కూర్చుంటే ఎంతో బాధ కలిగింది ప్రసాద్‌కి. ఆయనెప్పుడు పెద్ద ఉయ్యాల మంచంపై మహారాజులా దర్జాగా కూర్చునేవాడు. బులెట్ బండి ఉండేదాయనికి. అవసరమైనపుడు టాక్సీలో తిరిగేవాడు. వచ్చిన సినిమా అల్లా టౌన్‌కెళ్లి చూసేవాడు.
    ‘‘అంతా బాగే పెద్దమ్మా! మీ అందర్నీ చూసి పోదామని వచ్చాను’’ అన్నాడు పెద్దమ్మతో అక్కడున్న స్టూల్‌పై కూర్చుంటూ.
    ‘‘మంచి పని చేసావు నాయనా!’’ అంటూ దగ్గరగా కూర్చుందావిడ. కాఫీ కలపబోతే వద్దన్నాడు.
    భార్యాభర్తలిద్దరు ఊర్లో అందరి విశేషాలు వివరంగా చెప్పారు తమ సంగతి తప్ప. ఇక ఉండబట్టలేక ‘‘ఆ ఇల్లొదిలి ఇక్కడికి వచ్చారేంటి పెదనాన్నా?’’ అడిగాడు ప్రసాద్.
    ‘‘వానప్రస్థాశ్రమం!’’ అన్నాడాయన గట్టిగా నవ్వేస్తూ.
    ‘‘పొలం అమ్మేశాం నాయనా! అప్పులు అన్నీ హరించేసాయి. మీ పెదనాన్న అలవాట్లు ఖరీదైనవి కదా!’’ అందావిడ నవ్వుతూ.
    ‘‘సిరిదా వచ్చిన వచ్చును. పోయిన పోవును అన్నట్టు లక్ష్మి వెళ్లిపోయే టైం వస్తే ఏదో వంకన పోతుంది. ఏ అలవాట్లు లేని వాళ్ల ఆస్తి కరక్కుండా ఉంటుందా?’’ అన్నాడాయన గంభీరంగా.
    ‘‘ఆస్తివిషయం కాకపోయినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే బాధపడాల్సింది నువ్వే కదా! అందుకోసమైనా నువ్వు వాటిని మానెయ్యాలి పెదనాన్నా’’
    ఆప్యాయంగా అన్నాడు ప్రసాద్.
    ‘‘మందూ, సిగరెట్ నా తిండిలో భాగమే! అవి లేకుండా నేను లేను. నాతోపాటే అవీ. నేను ఉన్నన్నాళ్లు తప్పవు.’’ అన్నాడాయన.
    ‘‘అలా అంటే ఎలా? కాస్త ఆలోచించాలి కదా!’’ అన్నాడు ప్రసాద్ అనునయంగా.
    ‘‘అయినా మీ పిచ్చిగానీ ఏ దురలవాట్లు లేని వాళ్లు చచ్చిపోకుండ ఉంటారా?’’ ఫెళ్లున నవ్వుతూ లాల్చీ జేబులోంచి లైటర్ తీసి వెలిగించుకున్నాడాయన.
    ‘‘ఇదీ వరస’’ అన్నట్టు చూసిందావిడ ప్రసాద్‌వైపు.
    పెదనాన్న జీవితాన్ని అంత సులువుగా, విలాసంగా నిర్వచించడం చూసి ఆశ్చర్యపోయాడు ప్రసాద్. ఆవిడ టీ పెట్టడానికి లోపలికి వెళ్లింది. ఆమె వెనకే ప్రసాద్ వెళ్లి ‘‘పెద్దమ్మా! ఒక చీర కొనుక్కో’’ అంటూ రెండు వేలు తీసిచ్చాడు.
    ‘‘అయ్యో ఎందుకు బాబూ!’’ అందావిడ మొహమాటంగా.
    ‘‘టైం లేదు పెద్దమ్మా! లేకపోతే అమ్మచేత కొనిపించేవాడిని’’ అంటూ ఆమె ఇచ్చిన టీ తాగి మరో గంట కూర్చుని లేచాడు. భోంచేసి వెళ్లమని బలవంతం చేసారిద్దరు. వద్దని చెప్పి అక్కడినుండి ‘చిన్నాన్న ఇంటికి వెడతాను’ అంటూ బయలుదేరాడు. వద్దన్నా భార్యాభర్తలిద్దరూ కొబ్బరి తోటలో చాలా దూరం కూడా నడుస్తూ వచ్చారు. వాళ్లని చూస్తుంటే కళ్లు చెమర్చాయి ప్రసాద్‌కి. మళ్లీ ఎప్పుడు కనబడతారో అన్నట్టుగా ఆర్తిగా చూసాడు వాళ్లవైపు.
    పొలంనుంచి ఊర్లోకొచ్చి అక్కడినుంచి చిన్నాన్న ఇంటికి బయలుదేరాడు. దూరంనుంచే కనపడింది చిన్నాన్నా డాబా ఇల్లు. పిన్ని ఇంటి ముందు నిలబడి పక్కింటావిడతో మాట్లాడడం చూసాడు.
    దూరంనుండే గుర్తుపట్టేసిందావిడ. ‘‘మా ప్రసాదేనా? ఎన్నాళ్లకెన్నాళ్లకి?’’ అంది ఆప్యాయంగా
    ‘‘ఎలా ఉన్నావు పిన్నీ?’’ అంటూ ఆమెతోపాటే లోపలికి వచ్చాడు ప్రసాద్.
    ‘‘అమ్మా నాన్న కులాసాయేనా? నీ పెళ్లికి రాలేకపోయాను. కోడలెలా ఉంది?’’ అడుగుతూ అతన్ని కూర్చోమని చెప్పి మంచం కిందున్న కొబ్బరి బొండం కొట్టి గ్లాస్ నిండా పోసి ఇచ్చిందామె.
    కొబ్బరి నీళ్లు తాగి ‘‘్థంక్స్ పిన్నీ! తమ్ముళ్లేరీ?’’ అడిగాడు కూర్చుంటూ.
    తను కూడా కూచుంటూ ‘‘వస్తారిప్పుడు వచ్చే టైం అయిందిలే. చిన్నప్పటినుండి అన్నయ్యలా చదువుకోండ్ర! అని పోరినందుకు టెన్త్ పాస్ అయ్యారు. ఇంటర్ చదువుతాం అన్నారని నేను భీమవరంలో బోలెడు ఖర్చుపెట్టి మకాం పెట్టి ఇద్దర్నీ కాలేజ్‌లో జాయిన్ చేసాను. రెండేళ్లు వచ్చిన సినిమా అల్లా వదలకుండా చూసి అన్ని గెంతులూ వేసి ఫెయిల్ అయ్యారు. ఇక చదవలేం మావల్ల కాదన్నారు. ఎంతో బతిమాలాను. చివరికి చచ్చినట్టు నోరు మూసుకుని మకాం ఎత్తుకుని వచ్చేసాం’’ అందావిడ కళ్ల నీళ్లు తుడుచుకుంటూ బాధగా.
    ప్రసాద్ ఏదో అనబోయేంతలో అతని చిన్నాన్న కొడుకులిద్దరు రమేష్, రాజా వచ్చారు
    ‘‘్భలే వచ్చావన్నయ్యా! మమ్మల్ని గుర్తుపెట్టుకుని’’ అంటూ ఆనందపడ్డారు.
    ఆమె ముగ్గురికీ అన్నం వడ్డించింది..
    ‘‘ఏం చేస్తున్నారు మీరిద్దరూ?’’ అడిగాడు ప్రసాద్.
    ‘‘మాకా చదువులు పడవు అన్నయ్యా! చదివినా ఎక్కడికో పోయి ఉద్యోగం చేయలేం!’’ అన్నాడు రమేష్.
    ‘‘మనూరు, మన పొలం, మన తోటలో వున్న హాయి ఎక్కడా ఉండదన్నయ్యా!’’ అన్నాడు రాజు.
    వాళ్లవైపు ఆశ్చర్యంగా చూసాడు ప్రసాద్. వాళ్ల కళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ నటనా లేదు వాళ్ల మొహాల్లో.
    తర్వాత ప్రసాద్ ఉద్యోగం గురించి కుతూహలంగా అడిగి తెలుసుకున్నారు వాళ్లు. మరో గంట కూర్చుని పిన్నికి కూడా రెండు వేలిచ్చి చీర కొనుక్కోమని చెప్పి బయలుదేరాడు ప్రసాద్.
    ‘‘రేపు వెళ్లొచ్చు కదా అన్నయ్యా! సాయంత్రం ఊర్లోకి వెళ్దాం సరదాగా!’’ అన్నారు తమ్ముళ్లు.
    ‘‘నాకు లీవ్ లేదమ్మా! రాత్రికి బస్ టికెట్ ఉంది నాకు’’ అంటూ బయలుదేరాడు ప్రసాద్.
    తమ్ముళ్ల వైఖరి కూడా అతనికి అబ్బురంగా తోచింది.
    అక్కడినుండి సూర్యం మాస్టారింటికి వెళ్లాడు. ఆయనతో ఎప్పుడైనా అమెరికానుంచి మాట్లాడుతూ ఉంటాడు కనుక ఆయనకి తెలుసు ప్రసాద్ ఇలా వస్తున్నట్టు. ఆయన ప్రసాద్‌ను చూడగానే కౌగలించుకున్నాడు.
    ‘‘మేమంతా నీ గురించి గొప్పగా చెప్పుకుంటామయ్యా’’ అన్నారాయన. అరుగుమీద కూర్చున్నారిద్దరు, కుశల ప్రశ్నలయ్యాక ఊరి విషయాలు మాట్లాడుకుంటుంటే గంట ఇట్టే గడిచిపోయింది. వాచ్ చూసుకుని ఇక లేవాలి అనుకుంటూ ప్రసాద్ ‘‘మాస్టారూ! మా ఫ్యామిలీ గురించి మీకంతా తెలుసుకదా!’’ అన్నాడు సంశయంగా
    ‘‘నాకు తెలియకపోవడం ఏమిటి? ఈ ఊరివాడ్ని’’ అన్నారాయన. ప్రసాద్ నెమ్మదిగా తన మనసులోని సంఘర్షణ వివరించాడు.
    ‘‘మాస్టారూ! మా పెదనాన్నలు, తమ్ముళ్లూ అంతా నిశ్చింతగా బతుకుతూ ఉన్నారు. మంచిదే! కానీ వాళ్లు జీవితంలో ఏమీ నేర్చుకోరా? తమని తాము దిద్దుకోరా? ఎలా సుఖంగా వీలుగా ఉంటే అలా బతికేస్తూ ఉంటారా?’’
    అమాయకంగా అడుగుతున్న అతన్ని చూసి మాస్టారు పకపక నవ్వి ఊరుకున్నారు.
    ప్రసాద్ ఆ విషయం వదలకుండా ‘‘మరి నేను వృత్తిరీత్యా వ్యక్తిగతంగా కూడా నిరంతరం ఏదో నేర్చుకుంటూనే ఉంటాను మాస్టారూ! శ్రమపడుతునే ఉంటాను. నన్ను నేను పునర్నిర్మించుకుంటూ ఉంటాను. మరి వీళ్లు ఏమీ కష్టపడకుండా, క్రమశిక్షణ లేకుండా అంత ధీమాగా, పైగా ఆత్మవిశ్వాసంతో ఎలా బతకగలుతుతున్నారు? చిత్రంగా ఉంది’’ అన్నాడు.
    ‘‘ప్రసాద్! నూతిలో కప్పలు అదే ప్రపంచమనుకుని ఆనందంగా ఉంటాయి. అలా అని అవి గొప్పవి అనలేము కద? ఇదీ అంతే! కానీ నువ్వు ప్రవహించు జీవనదివి. నిత్య విద్యార్థివి. ఎత్తులకు ఎదిగే వృక్షానివి. నీకూ వాళ్లకీ పోలికే లేదు’’ అన్నారాయన చేయి కలిపి వీపుమీద తుడుతూ. ఆయనకి మరోసారి నమస్కారం చేసి వెనుదిరిగాడు ప్రసాద్.
    అప్పటికి సాయంత్రం అయిదైంది. ప్రసాద్ సునీల్ ఇంటికి వచ్చి బాగ్ తీసుకుని బయలుదేరాడు. సునీల్ తల్లి స్వీట్స్‌పెట్టి మజ్జిగా ఇచ్చింది.
    ‘్భజనం ఎలా బాబూ?’ అంది.
    ‘‘దారిలో బస్సు ఆపుతాడు కదా! అక్కడ తింటానండీ! వస్తానండీ’’ అని ఆమెకి చెప్పి వీధిలో ఉన్న సునీల్ తండ్రికి కూడా చెప్పి బయలుదేరాడు.
    బస్సులో కూర్చున్నాక ప్రసాద్‌ని ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేసాయి.
    అతని మనసులో ఎక్కడో ఏదో అర్థం కాని భావన. జవాబు రాని లెక్కతో కుస్తీ పడుతున్నట్టు ఉంది.
    మాస్టారు అన్న మాటలు అతనికి పూర్తి సంతృప్తిని కలిగించలేదు.
    పెదనాన్నలు, తమ్ముళ్లు ఉన్నంత ధీమాగా హాయిగా తనెందుకు లేడు? తనలో ఏదైనా లోపం ఉందా?
    వాళ్లకున్న జీవించే కళ ఇంత చదువులు చదివి డాలర్లు సంపాదిస్తున్న తనకు లేదా?
    వాళ్లంతా తాము చేసిన పనుల దుష్ఫలితాలు చూసి కుదేలైపోయి బేలగా మారిపోకుండా తమను తాము సమర్ధించుకుంటు బతకగలగడం గొప్ప అదృష్టం కదా! అది వారికెలా సాధ్యం అయింది?
    జీవితానికి సంబంధించి ఎవరి స్కేల్ వారిదేమో! మన స్కేల్‌తో ఇంకొకరిని కొలవడం ఆ ప్రాతిపదికన అంచనా వేయడం కరెక్టు కాదేమో! ఆలోచనలు తెగడంలేదు.
    నేను నా జీవన ప్రవాహాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఎటు మళ్లించాలో ప్లాన్ చేసుకుని కాలువ తవ్వుకుని, రెండువైపులా కాంక్రీట్ చేసుకుని బతుకుతున్నాను. ఉద్యోగంలో పై మెట్టెక్కడానికి నిరంతరం కష్టపడుతు ఉన్నాను. ఇంకా ఏదో సాధించాలని ఆరాటపడుతున్నాను. మరి వాళ్లు? ఏ ప్రయత్నమూ లేకుండా అనాయాసంగా ఏదో తీరం చేరచ్చులే అన్నట్టు ధీమాగా నవ్వుతూ సాగిపోతున్నారు.
    ఇలా తనలో తాను అంతర్మధనం చెందుతూ ఆలోచనా సముద్రంలో మునకలేస్తూ ఈదగా ఈదగా అతనికి ఒక ఒడ్డు దొరికింది. అప్పుడు ఒక రహస్యం తెలిసినట్టనిపించింది అతనికి.
    మాష్టారన్నది తప్పు. ఆయన నామీద వాత్సల్యంతో అలా అన్నారు. కానీ నిజానికి జీవ నదులు వాళ్లు. నేను కాదు. పరిస్థితుల్నీ, సమయాన్నీ ఎలా వస్తే అలా అంగీకరిస్తూ జీవితాన్ని కొండలూ, గుట్టలు, లోయలగుండా పరిగెత్తిస్తూ, నిర్భయంగా నవ్వుతూ ముందుకు సాగిపోతున్న వాళ్లే సహజంగా ప్రవహిస్తున్న జీవనదులు.
    కల్లోల జలధిలా ఎగసిపడిన అతని మనసిప్పుడు నెమ్మదించి నిర్మల తటాకంలా మారింది. ఆ తర్వాత ప్రసాద్ ప్రశాంతమైన మనసుతో తృప్తిగా హైదరాబాద్ చేరుకుని అక్కడినుండి న్యూయార్క్ చేరుకున్నాడు. తన రొటీన్‌లో పడ్డాడు.
    ఇప్పుడు అతని ఆలోచనల్లో తన వాళ్లను గురించిన దిగులు స్థానే గర్వం, సంతృప్తీ చోటు చేసుకున్నాయి. మొన్నటి నా ఇండియా విజిట్‌లో మరో సందేశం నేర్చుకున్నాను మా వాళ్లనుంచి అనుకున్నాడు తృప్తిగా.
  • అల్లూరి గౌరీలక్ష్మిడిప్యూటీ జనరల్ మేనేజర్ (అడ్మిని)
    ఎపిఐఐసి లిమిటెడ్, 4వ అంతస్తు, పరిశ్రమ భవన్,
    బషీర్‌బాగ్, హైదరాబాద్- 500 004.
    040-23212798



  • Monday, February 2, 2015

    అమ్మకో అబద్ధం

    Published in జాగృతి ఆన్ 20th Oct 2014
    Page 1



    Page 2



    Page 3



    Page 4



    Page 5



    Page 6


    కలసికట్టుగా ఎదుగుదాం!

    Published in ఆంధ్రప్రభ 15th Oct 2014

    నిన్నటివరకూ అంతా కలిసున్నది చరిత్రే. దాన్ని చెరపడం కాదు మన పని. కొత్త చరిత్ర సృష్టించాలి. అది ఆదర్శనీయంగా ఉండాలి. తెలుగుజాతి రెండు శిరస్సులున్న మహావృక్షం అని చాటాలి. దేశంలోని వివిధ రాషా్ట్రల ముందు మన జాతి చిన్నబోకూడదు. విడిపోయాక విజయాలు సాధించాలంటే కలిసున్నప్పటి సాక్ష్యాలు చెరిపెయ్యకూడదు. 

    ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలనూ, మరికొన్ని వ్యాఖ్యలనూ, సందర్భాలనూ చూసిన తరువాత మనసులో కలిగిన ఆవేదన పంచుకోవాలనిపించింది. అందుకే ఈ వ్యాసం రాస్తున్నాను.
     
    ధైర్యంగా, నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘విడిపోయి అత్మీయుల్లా కలిసుందాం’ అన్న ఆదర్శం కనుమరుగైంది. ‘ఎలాగూ విడిపోయాం. వైషమ్యాలకు తెరతీద్దాం. నాలుగుమాటలని సంతృప్తి పడదాం’ అన్న ధోరణి ఎదురవుతోంది. తెలంగాణ పెద్దలూ, రాజకీయ నాయకులూ ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన నష్టాన్నీ, ఒప్పందం అమలుజరగని తీరునూ తమ ప్రజలకు సులువైన భాషలో చెప్పే క్రమంలో, ఆ తొందరలో జరిగిన తప్పిదమిది. నిజానికి పొట్టచేత బట్టుకుని, తమ రాజధాని అన్న మమకారంతో హైదరాబాదు చేరిన ఆంధ్రులు చేసిన అన్యాయం ఏమీలేదు. రెండు రాషా్ట్రలు ఏర్పడినా, ప్రస్తుతానికి కొందరు ఆంధ్ర ప్రభుత్వోద్యోగులూ, వారి కుటుంబాలూ, వారికి సహాయంగా పరోక్ష ఉపాధి పొందుతున్న వారు మాత్రమే హైదరాబాదు వదిలి వెళతారు. ఈ సంఖ్య చాలా తక్కువ శాతం. ఈ మాత్రం దానికి విరోధాలు పెంచుకోవడం అవసరమా? విజ్ఞులు, వివేకవంతులైన రాజకీయ నేతలు ఇటువంటి భేదభావాలను మొగ్గలోనే తుంచే కార్యక్రమం చేపట్టడం అత్యవసరం.
     
    తమని తామే పాలించుకోవాలన్న తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. వారు ఆ ఆనందాన్ని హుందాగా నిలబెట్టుకోవాలి. ప్రభుత్వంలోని వారు తక్షణమే ఉమ్మడి రాష్ట్రం వల్ల తాము నష్టపోయిన ఉద్యోగాలు, ఇతర సదుపాయాలూ, అవకాశాలూ నేటి యువతకు అందే పని మీద దృష్టి నిలపడం మంచిది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంత ఉన్నదీ లెక్కలు తీసి, వారిలో ఎంతమంది కి ఎటువంటి ఉపాధి కల్పించగలరో ఒక ప్రణాళిక వెయ్యాలి. వారి ఉత్సాహాన్ని బట్టి వివిధ వృత్తి విద్యలు నేర్పిస్తూ, తగిన శిక్షణఇస్తూ అందరికీ ఉపాధి కల్పించేట్టుగా ఒక టార్గెట్‌ పెట్టుకుని ముందుకు సాగితే బంగారు తెలంగాణ తప్పక సాకారమవుతుంది. ఇతర రాషా్ట్రల వాళ్ళ వలె ఆంధ్రులు ఇప్పుడు పొరుగురాష్ట్రం వారిగా ఉం టారుతప్ప, ఆంధ్రులంతా ఇల్లు ఖాళీచేసినట్టు వెళ్ళిపోరు కదా! రెండు తెలుగురాషా్ట్రల మధ్య పెళ్ళిళ్ళు, పేరంటాలు ఉంటాయి కదా. 
     
    ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయి, అలరారుతున్న వేళ, ఒకే భాష మాట్లాడే రెండు రాషా్ట్రల ప్రజల మధ్య ఎటు వంటి పొరపొచ్ఛాలూ ఉండకూడదు కదా! ఎవరెన్ని మాట్లాడినా, ఇంటికి చేరాక మన పక్కింటి వాళ్ళతోనే మనకి అవసరమొస్తుంది. ఇరుగుపొరుగుతో మనకి సఖ్యతే అనివార్యం. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి జరిగిన అన్యాయానికి ఆంధ్ర పాలకులెంత కారణమో, తెలంగాణ పాలకులూ అంతే కారణం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలెంత అమాయకులో ఆంధ్ర ప్రజలూ అంతే అమా యకులు. తెలంగాణ భూముల ఆక్రమణ విషయాల్లాంటివి పెద్దవి. రాజకీయ పరపతి ఉన్నవారు కొందరు చౌకగా కొనుక్కున్నారు. కొం దరు కబ్జా చేసుకున్నారు. అది పెద్దవారి వ్యవహారం. సామాన్య ప్రజల పని కాదు. ఇరు ప్రాంతాల పెద్దవాళ్ళు ఎప్పుడూ స్నేహితులుగానే ఉంటారు. ఆ విషయం సగటు మానవులు తెలుసుకోవాలి. 
     
    తెలుగుప్రజల పండగలూ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతా ఒక్కటే! ఆంధ్రా తెలంగాణ మధ్య చిన్న చిన్న తేడాలు ఉంటా యంతే! అవి ఒకరినొకరు గౌరవించుకోవలసినవి. పరిహాసం చేస్తే దానికి ఎవరైనా పరిహారం చెల్లించక తప్పదు. ముఖ్యంగా హైదరాబాద్‌కి ప్రత్యేకసంస్కృతి ఉంది. ఇక్కడి ప్రజలంతా ఎంతో సంస్కారం కలిగిన ప్రేమజీవులు. అందరినీ తమలో కలుపుకుంటారు. ఒక ఆఫీస్‌లో ఒకే సెక్షన్‌లో అన్నిరాషా్ట్రల వారూ, అన్ని మతాలవారు దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తూ కలిసిమెలసి ఉన్నారు అలాగే ఫ్లాట్స్‌లలో కూడా. మరి నిన్నటి వరకూ ఒకే రాష్ట్రంలో ఉన్న తెలుగువాళ్ళు ఇప్పు డు కొత్తగా ఫీలింగ్‌ తెచ్చి పెట్టుకోవడం ఎందుకు? కలిసుందామని ఆంధ్రావారూ, విడిపోదామని తెలంగాణవారు వివిధ కారణాల వల్ల కోరుకున్నారు. తెలంగాణ వారి కోరిక నెరవేరింది కాబట్టి వారు మరింత సంయమనం ప్రదర్శించాలి. అక్కడి వారు న్యూనత చెందకుండా తమలో కలుపుకోవాలి. మీకే ఇబ్బందీ రాదు హాయిగా ఉండం డని ఇతరులకు భరోసా ఇవ్వాలి. నిన్నటివరకూ మనమంతా కలిసున్నది చరిత్రే. దాన్ని చెరపడం కాదు మన పని. కొత్త చరిత్ర సృష్టించాలి. అది ఆదర్శనీయంగా ఉండాలి. తెలుగుభాషా జాతి రెండు శిరసులున్న మహావృక్షం అని చాటాలి. దేశంలోని వివిధ రాషా్ట్రల ముందు మన జాతి చిన్నబోకూడదు.
     
    విడిపోయాక విజయాలు సాధించాలంటే కలిసున్నప్పటి సాక్ష్యాలు చెరిపెయ్యకూడదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్రు లకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అందుకోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరిట తెలంగాణలో తెలుగు యూనివర్సిటీ ఉంది. ఇంతకంటే ఆంధ్రా తెలుగు వారి పట్ల తెలంగాణ తెలుగువారి సౌభ్రాతృత్వానికి గొప్ప ఉదాహరణ ఉండబోదు. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఇప్పుడు కొత్తగా రెండు రాషా్ట్రల తెలుగు ప్రజల మధ్యా పుడుతున్న అసహన భావాల్ని వెంటనే అరికట్టకపోతే క్రమంగా ఆంధ్ర ప్రజలు ఇక్కడే ఉంటూ, ఇక్కడి వారి పట్ల వ్యతిరేక భావాలు ప్రోది చేసుకునే ఒక విష సంస్కృతికి పునాదులేసినట్లవుతుంది. అది ఎంత మాత్రమూ అభిలషణీయం కాదు. సమంజసమూ కాదు. రెండు రాషా్ట్రల ముందూ ఎన్నో సమస్యలున్నాయి పరిష్కరించుకోవడానికి. ఎన్నో సవాళ్ళున్నాయి ఎదుర్కోవడానికి... ఎన్నో విజయాలున్నాయి సాధించుకోవడానికి. ఇరు రాషా్ట్రలను ప్రగతి పథకం వైపు నడిపించే బృహత్తర కార్యసాధనలో అంతరాలు పెరగక పనిచేయాలి. ఇదే ప్రస్తుతం ప్రతి ఒక్క తెలుగువాడి కర్తవ్యం. మన మనసు అద్దాలపై పడిన మరకల్ని సుస్నేహ భావమనే టిష్యూ పేపర్‌తో తుడిచేద్దాం! తళతళలాడే స్వచ్ఛ మనస్కులుగా మెలుగుదాం!!

    - అల్లూరి గౌరీ లక్ష్మి

    ఉషోదయం

    (Published in ఆంధ్రభూమి on 13th March 2014)
    Page 1 




    Page 2



    Page 3





    On a writers' trip to Nizamabad (Oct 2014)



    టాక్ టైం

    (Poste  in Kavisangamam 3rd Jan 2014)

    కాల్ లో ముళ్ళుంటాయి ఒకోసారి 
    గుచ్చుకుని గుండెల్ని సలుపుతాయి 
    మాటలే కదా అనుకుంటామా 
    మంటలు పుట్టిస్తాయవి
    కారు చౌకే కదా అని రింగ్ చేశావా ?
    అధిక ప్రసంగాలకి ఆహుతవుతావు
    అప్పుడప్పుడూ కాల్స్ మైండ్ ని బ్లాస్ట్ చేస్తాయి
    మొబైల్ నుంచి మిస్సైల్స్ దూసుకొస్తాయి
    కొందరు మాట్లాడాక సైకియాట్రిస్ట్ ను కలవాలి
    కొన్ని ఫోన్లు పెట్టాక నిష్టూరాలు వెంటాడతాయి
    మిస్ డ్ కాల్స్ మోసానికి బలికాకు
    నీ చేత్తో నిన్నే చరిచే చమక్కులవి
    వాగుడు విద్యుత్తై ప్రవహిస్తే
    నీ మాట నీకే షాక్ కొట్టి కాల్చొచ్చు
    టైం పాస్ కని గాల్లోకి గాసిప్ లొదలకు
    టైం బాంబులై నిన్నే గోల్ చేస్తాయవి
    విలువైన పలుకులు వ్యక్తిత్వపు మెరుపులు
    వ్యర్ధపు మాటలు నీ రూపుకు చెరుపులు